SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 6:14 pm Posted by : SALAM PRODDATUR

వృక్ష కడప జిల్లాగా ప్రకటించాలి

 

–కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి వినతి.

సలాం ప్రొద్దుటూరు  (కడప):

కడప జిల్లాను “వృక్ష కడప జిల్లా”గా ప్రకటించి పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంస్కృతి సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను కోరారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి జిల్లాలో విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై ఆయన చర్చించారు.ఈ సందర్భంగా ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, గ్రామాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న ప్రతి స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించాలని సూచించారు.పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృత హరిత ఉద్యమం అవసరమని పేర్కొన్నారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన హరిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డాక్టర్ టి.డి. వరుణ్ కుమార్ రెడ్డి, షేక్షావల్లి, వేమ నారాయణ తదితరులు పాల్గొన్నారు.