SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 9:10 am Posted by : SALAM PRODDATUR

పాలకులే ఓటర్లను నిర్ణయించే దౌర్భాగ్యం–మాజీ ఎం ఎల్ ఎ రాచమల్లు

సలాం ప్రొద్దుటూరు:

ప్రజాస్వామ్యంలో ఓటరు పాలకుడిని ఎన్నుకోవాలి, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలకులే తమకు నచ్చిన వాళ్లను ఓటర్లుగా ఉంచి, నచ్చని వాళ్ల ఓట్లను తొలగిస్తూ ఓటర్లను నిర్ణయించే దౌర్భాగ్య స్థితి వచ్చిందని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన ఎంఆర్ఓ కార్యాలయం వెళ్లి  సర్ ద్వారా కూటం ప్రభుత్వం అవకతవకలు పాల్పడుతుందని తమకు సమాచారం అందిందని ఐ టి డి పి ద్వారా వైఎస్ఆర్సిపి నాయకులు ఓటర్లు ను గుర్తించి వారి ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతుందని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎంఆర్ఓ  భాస్కర్ కు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడారు.

ఐటిడిపి(iTDP) యాప్  ద్వారా అక్రమాలు

తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఐటిడిపి యాప్ ద్వారా తిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పక్కాగా ఓటు వేసే వాళ్లను గుర్తిస్తున్నారని ఆరోపించారు. అలా గుర్తించిన వారిని ఫారం-7 ఉపయోగించి చనిపోయినట్లుగానో లేదా ఊళ్లో లేనట్లుగానో చూపించి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇంటింటి సర్వే జరగడం లేదు

ప్రభుత్వ అధికారులు రూల్స్ ప్రకారం ప్రతి ఇంటి తలుపు తట్టి సర్వే చేయాలి. కానీ ప్రొద్దుటూరులోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఒక స్కూల్‌లోనో, సత్రంలోనో కూర్చొని సర్వే ముగిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు.

వైసీపీ ఏజెంట్లకు సమాచారం ఇవ్వకపోవడం

ప్రభుత్వ అధికారులు ఓటర్ల సర్వేకు వెళ్లే ముందు అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) సమాచారం ఇవ్వాలి. కానీ కొందరు అధికారులు కేవలం టీడీపీ ఏజెంట్లకే సమాచారం ఇస్తూ, వైసీపీ ఏజెంట్లను కొన్ని వీధుల్లోకి రాకుండా నిర్బంధిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 

నాడు EVM.. నేడు SSR మోసాలు:

గత ఎన్నికల్లో ఈవీఎంల వల్ల గెలిచిన కూటమి ప్రభుత్వం, రాబోయే రోజుల్లో గెలవడానికి ఇప్పుడు ఓటర్ల నమోదు/తొలగింపు (SSR) ప్రక్రియను అప్రజాస్వామికంగా వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ఉరిశిక్ష వేయాలి

నిజాయితీగల ఓటరు హక్కును కాలరాయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఇలాంటి అక్రమాలకు పాల్పడే ఏ ప్రభుత్వ అధికారి అయినా, పాలకుడైనా జైలుకు వెళ్లడమే కాదు, నడిబజార్లో ఉరితీసినా తప్పులేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కార్యకర్తలకు, ఓటర్లకు పిలుపు:

ఓటర్ల నమోదు ప్రక్రియకు ఇంకా 29 రోజుల సమయం ఉందని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటు ఉంటేనే ప్రజలకు గౌరవం, సంక్షేమ పథకాలు అందుతాయని.. ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలని కోరారు.