SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:26 pm Posted by : SALAM PRODDATUR

సైన్స్ ఫలితాలు సామాన్యులకు అందాలి

-జెవివి పూర్వ అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్.

సలాం ప్రొద్దుటూరు :

సైన్స్ అందిస్తున్న ఫలితాలు ఈనాడు సామాన్య ప్రజలకు అందడం లేదని, కామన్ స్కూల్ విధానం అందుబాటులోకి రావలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ అన్నారు. ఈరోజు స్థానిక జెవివి కార్యాలయం నందు జనవిజ్ఞాన వేదిక మెంబర్షిప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక జెవివి అధ్యక్షులు వేంపల్లి రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ సమాజంలో అశాస్త్రీయ ధోరణులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా పాలకులు కృషిచేయాలని కోరారు.

జెవివి రాష్ట్ర కార్యదర్శి శివరాం మాట్లాడుతూ పాలకులు ప్రజల్లో మతాల పేరుతో కులాల పేరుతో విద్వేషం పెంచి మనుషులను విడదీస్తున్నారని, కార్పొరేటీకరణకు పాలకులు దాసోహం అవుతున్నారని, ప్రజలందరూ ఐకమత్యంతో పాలకుల విధానాలను తిప్పికొట్టాలని అన్నారు.

జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ 38 సంవత్సరాలుగా ప్రజల్లో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడంలో జెవివి పాత్ర కీలకమని, విద్యార్థుల్లో చెకుముకి సైన్స్ సంబరాల పేరుతో వారిలో సృజనాత్మకతను, ప్రశ్నించేతత్వం పెంపొందిస్తోందని, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు జెవివిలో భాగస్వామ్యం కావాలని అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్.కె. సరస్వతి, సునీత, జెవివి నాయకులు గోపీనాథ్ రెడ్డి, రాజేష్, మురళీగుప్త, ఉషారాణి, మధుసుదన్ రెడ్డి, రవిబాబు, డా. మురుకూటి సూర్యనారాయణ రెడ్డి, శ్రీరాములు, ఉదయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.