SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 7:23 pm Posted by : SALAM PRODDATUR

అన్నమయ్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి

సలాం ప్రొద్దుటూరు 

 

సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహ స్థాపనకు జిల్లా యంత్రాంగం తక్షణమే అనుమతి మంజూరు చేయాలని అన్నమాచార్య కళాపీఠం అధ్యక్షుడు ఎడవల్లి రమణయ్య కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించిన అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై వేలాది సంకీర్తనలు రచించి తెలుగు భక్తి సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడు జిల్లాకు చెందినవారు కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. గతంలో బుడ్డాయిపల్లె కూడలి సమీపంలో అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా, అధికారిక అనుమతులు లేని కారణంగా సంబంధిత అధికారులు తొలగించిన విషయం తెలిసిందేనని గుర్తుచేశారు. అయితే అన్నమాచార్యుల వంటి మహనీయుని విగ్రహ ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరాలు లేదా వివాదాలు లేవని పేర్కొన్నారు.

ప్రజల్లో సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు.