SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 4:03 am Posted by : SALAM PRODDATUR

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సైనికోద్యోగుల సమావేశం

సలాం ప్రొద్దుటూరు (తాడేపల్లి):

మాజీ సైనికోద్యోగుల సేవలను పార్టీ బలోపేతానికి వినియోగించుకుంటాం అని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు.వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాజీ సైనికోద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాజీ సైనికులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాజీ సైనికోద్యోగులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన సైనికులు ఇప్పుడు సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. మాజీ సైనికోద్యోగుల అనుభవం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను సమాజాభివృద్ధి కోసం వినియోగించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.రాజకీయాలను ప్రజల సంక్షేమం, అభ్యుదయానికి సాధనంగా మాత్రమే భావించే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు అంటే అధికార రాజకీయాలు కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే జగన్‌  లక్ష్యమని అన్నారు.డిఫెన్స్ సర్వీసుల్లో పనిచేసిన మాజీ సైనికుల సేవలను పార్టీ పరంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఒక అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేసి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాజీ సైనికులు తమ అనుభవాన్ని వినియోగించాలని సూచించారు. అలాగే వైఎస్సార్‌సీపీపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ వేదికపైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మంచి సమాజ నిర్మాణంలో మాజీ సైనికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నదే వైఎస్ జగన్‌ గారి ఆలోచన అని పేర్కొన్నారు.రెండు నుంచి మూడు నెలల్లో మరోసారి సమావేశం నిర్వహించి, మాజీ సైనికోద్యోగుల వింగ్ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా కార్యక్రమాలపై సమగ్రంగా చర్చిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సమావేశంలో పాల్గొన్న మాజీ సైనికులు పార్టీ నాయకత్వానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.