SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 7:57 pm Posted by : SALAM PRODDATUR

పరికరాల దొంగతనం కేసు ఛేదించిన వన్ టౌన్ పోలీసులు

సలాం ప్రొద్దుటూరు: 

 

ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి నిర్మాణ, చెక్క పనులకు సంబంధించిన పరికరాల దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు.ఒక ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని, నిందితుల వద్ద నుంచి రూ.32 వేల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని వన్ టౌన్ సిఐ కొండారెడ్డి తెలిపారు. మంగళవారం వన్ టౌన్ పోలీసు స్టేషను లో ఆయన మాట్లాడుతూ మట్టిమసీదు ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ సుభహాన్, ముగ్గురు మైనర్ బాలురు కలిసి ఈ ఏడాది మే 17వ తేదీ రాత్రి ప్రొద్దుటూరు పట్టణంలోని మదరసా, మీరా బేకరీ సమీపంలోని యర్రగుంట్ల జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఉన్న నిర్మాణ ప్రదేశంలోకి ప్రవేశించి కరెంటు వైర్లు, ఇనుప కడ్డీలు కట్ చేసే యంత్రాన్ని దొంగిలించారని, రాత్రి మరో రెండు ప్రాంతాల్లో చెక్క పనులకు ఉపయోగించే పరికరాలను కూడా అపహరించారని వివరించారు. ఈ ఘటనపై పెన్నా నగర్‌కు చెందిన షేక్ సాదక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, కేసు విచారణ చేపట్టిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరిపి, సోమవారం సాయంత్రం వాసవి సర్కిల్ యర్రగుంట్ల సర్కిల్ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి ఇనుప కడ్డీలు కట్ చేసే యంత్రం, కరెంటు వైర్లు, చెక్క పని పరికరాలు, చెక్క పలకల కట్టింగ్ యంత్రం, బోల్టులు బిగించే యంత్రం తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.32 వేలుగా పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.