సలాం ప్రొద్దుటూరు (బెంగళూరు):
పారిశ్రామికవేత్తలుగా ఆర్యవైశ్యులు ఎదగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. బెంగుళూరులో జరిగిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహాసభ ఫెడరేషన్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగుళూరులో డిసెంబర్లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆర్యవైశ్య సమ్మిట్ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. సమ్మిట్ నిర్వహణ కమిటీ ఛైర్మన్గా మంత్రి టీజీ భరత్ గుప్తాను ఎన్నుకున్నట్లు కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ పెట్టుబడిదారులతో కలిసి భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే తరహాలో కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సమ్మిట్ నిర్వహించాలనుకోవడం గొప్ప విషయం అన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆర్యవైశ్య ఆర్గనైజేషన్లన్నీ కలిసి పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. ఆర్యవైశ్యులు ఎలాంటి మంచి కార్యక్రమం చేపట్టినా తన సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి టీజీ భరత్ గుప్తా వారిని కోరారు. ఇక ఆర్య వైశ్యులందరూ తమ పేరు చివర గుప్తా అని పెట్టుకోవాలని ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ పెద్ద కార్యక్రమంలో ఆర్యవైశ్యులందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సేవ చేయాలన్న ఆలోచన ఆర్యవైశ్యుల్లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ ఇల్లూరు లక్ష్మయ్య, కేరళం ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్, పాండిచ్చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధాబన్, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిని, మహాసభ యువజన ప్రెసిడెంట్ రాజేష్, వాసవి సేవాదల్ శబరి, తమిళనాడు మహిళా విభాగం అధ్యక్షురాలు లావణ్య, తమిళనాడు యువజన మహాసభ అధ్యక్షుడు రంజిత్ కుమార్, కేరళ మహిళా విభాగం అధ్యక్షురాలు శాంతి, తదితర ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.