SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 4:01 pm Posted by : SALAM PRODDATUR

జూన్ 19న తల్లికి వందనం నిధులు జమ

సలాం ప్రొద్దుటూరు :

ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్ధులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం (Talliki Vandanam) డబ్బుల్ని ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో జమ చేయాల్సి ఉంది.ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్హుల వివరాలను క్షేత్రస్దాయిలో పరిశీలించే కార్యక్రమం ఇంకా కొనసాగుతుండటంతో డబ్బుల జమ తేదీ మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఓసారి చూద్దాం..ఈసారి వేసవి సెలవుల తర్వాత కొత్త విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కాబోతోంది. అదే రోజు తల్లికి వందనం నిధుల్ని తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే స్కూళ్ల నుంచి సేకరించిన విద్యార్ధుల డేటాను క్షేత్రస్దాయిలో పరిశీలన కోసం సచివాలయాలకు పంపారు. ఎక్కడా అనర్హులకు చోటివ్వకుండా అర్హులకే ఈ నిధులు అందేలా చూడటానికి ప్రభుత్వం క్షేత్రస్దాయిలో నిశిత పరిశీలన చేయిస్తోంది. ఇందుకోసం కఠిన మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. దీంతో ఈ మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్ధాయిలో పరిశీలన కొనసాగుతోంది.

 

తల్లికి వందనం పథకంలో దాదాపు 60 లక్షలకు పైగా లబ్దిదారులు ఉండటంతో వీరి డేటా పరిశీలన, ఖరారు ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా అనుకున్న విధంగా ఈ నెల 12న తల్లికి వందనం నిధుల విడుదల ఉండదని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా జూన్ 19న తల్లికి వందనం నిధుల్ని జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో మళ్లీ తేడా రాకుండా క్షేత్రస్దాయి నుంచి అర్హుల సమాచారం వచ్చి, జాబితా సిద్దం అయ్యాక అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జూన్ 19న లేదా ఒక రోజు అటు, ఇటుగా నిధుల విడుదల ఖాయమే.