SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 1:01 pm Posted by : Vasantha Sreenivasula Reddy

ఫోటోలకే హాజరు.. పనికి డుమ్మా..!

తొండూరు జూన్ 02 : గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం పూర్తిగా గాడి తప్పింది. పని చేయకుండా కేవలం హాజరు వేయించుకుని ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం పనికి వెళ్లిన కూలీలు యన్ యం యం యస్ యాప్‌లో ఫోటో దిగిన వెంటనే ఇంటికి వెళ్లిపోతున్నారని,మధ్యాహ్నం మళ్లీ ఫోటో కోసం మాత్రమే హాజరవుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఉదయం వెళ్లిపోయిన కూలీలకు మధ్యాహ్నం ఫోటో కోసం ఫీల్డ్ అసిస్టెంట్లే స్వయంగా ఫోన్లు చేసి పిలిపిస్తున్నారనే సమాచారం బయటకు వస్తోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పని జరగకపోయినా,రికార్డుల్లో మాత్రం పనులు జరిగినట్లు చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.